సమాజాన్ని విస్మరించిన సినిమా | Sakshi
Sakshi News home page

Published Sat, Jul 7 2018 1:04 AM

Guest Columns On Present Movies Situation in Bollywood  - Sakshi

అత్యంత శక్తిమంతమైన భారత సినీ ప్రపంచం నేర ప్రపంచంలో రారాజులైన ‘భాయ్‌’ల ముందు మోకరిల్లిందనే విషయం మనం మరువ రాదు. తమ నిరసన తెలపడానికి ఈ సినీ ప్రముఖులు ఏనాడూ ప్రధానమంత్రి ఇంటికి ఊరేగింపుగా పోలేదు. వారు గుట్టు చప్పుడు కాకుండా రాజీపడతారు. ముంబై పోలీసుల్లో ఓ చిన్న బృందం గ్యాంగ్‌ స్టర్లను ఎన్‌కౌంటర్లలో కాల్చిచంపే పని ప్రారంభించగానే వారు సాగిలపడి మరీ తమ జోలికి రావద్దని వేడుకున్నారు. అయితే, అంతా చీకటే కాదు, కొత్త ఆశలు చిగురించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అనేక మంది కొత్త, యువ సినీ దర్శకులు, కళాకారులు తమ అభిప్రాయాల్ని బాహాటంగా తమ చిత్రాల్లో ప్రదర్శించడానికి వెనుకాడడం లేదు.
దేశంలో బాగా ప్రతిభ గల, విజయవంతమైన బడా సినీ దర్శకులు అధి కారంలో ఉన్నవారికి ఏ మాత్రం జంకు లేకుండా ఎందుకు లొంగిపోతున్నారు? విధూ వినోద్‌ చోప్రా– రాజ్‌కుమార్‌ హిరాణీ తాజా సినిమా సంజూ నా వాద నకు కారణం. సంజయ్‌దత్‌ని దుర్మార్గులైన జర్నలి స్టుల రాతలకు బలి అయిన నటునిగా ఈ సినిమాలో నిజాయతీ లేకుండా చిత్రించారని నేను చెప్పాను. అమెరికాలో ప్రసిద్ధ హాలీవుడ్‌ హీరో రాబర్ట్‌ డీ నీరో అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ను రాయడానికి వీలులేని మాటలతో తీసిపారేస్తూ మాట్లాడుతున్న ఈకాలంలో పెద్ద పెద్ద సినీ నిర్మాతలు రాజ్‌ ఠాక్రేకు కృతజ్ఞతలు చెప్పుకుంటూ కొత్త సినిమా నిర్మాణం ఎందుకు ప్రారంభిస్తున్నారు? మహరాష్ట్ర నవనిర్మాణ్‌ సేన నేత రాజ్‌ ఎంతటి బెదిరింపు ధోరణితో మాట్లాడినా, కిందటి మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మొత్త 288 సీట్లకుగాను ఒక్క సీటు మాత్రమే సాధించగలిగారు. మరాఠీల కోసం పాటుపడుతున్నానని ఎన్ని గొప్పలు చెప్పుకున్నా ఈ పార్టీకి 227 సీట్లున్న ముంబై మునిసి పల్‌ కార్పొరేషన్‌లో వచ్చిన స్థానాలు కేవలం ఏడే. 

అయితే ముంబై సినిమా నిర్మాతలు రాజ్‌ఠాక్రే ముందు ఎందుకు సాగిలపడుతున్నారు? కారణం– ఆయన గెలిచేదేమీ లేకున్నా చాలా విధ్వంసం సృష్టిం చగలరు. అందుకే సినీరంగం ఇలాంటివారికి తేలికగా లొంగిపోతుంది. ఈ సినీ పరిశ్రమకు మాఫియా ముఠాలన్నా, కండబలంతో అధికారం చెలాయించే వారన్నా భయం ఎక్కువ. భారత సమాజంలో దుర దృష్టకర విషయం ఏమంటే, మన సృజనశీల వర్గాలు సాధారణంగా అధికారంలో ఉన్నవారికి అనుకూ లంగా వ్యవహరిస్తారు. ఇండియాలో కొందరు విద్యా రంగానికి చెందిన అధ్యాపకులు, చిత్రకారులు, కొందరు జర్నలిస్టులు మినహా సృజనాత్మక రంగా లకు చెందిన పలువురు ప్రముఖులు ప్రభుత్వాలు, మాఫియా ముఠాల ముందు తాబేదారులుగా ప్రవ ర్తిస్తారు. అయితే వందల కోట్ల వసూళ్లు, వేలాది కోట్ల విలువైన స్టూడియోలున్న హిందీ సినీరంగం ఎందు కింత సిగ్గుమాలిన రీతిలో వ్యవహరిస్తోంది? 

పెరిగిన ‘దర్బారీ’ సంస్కృతి!
ప్రాచీన కాలం నుంచీ దేశంలో సాగుతున్న దర్బారీ సంస్కృతి నుంచి ఈ ధోరణి పుట్టుకొచ్చింది. కళలు, సంస్కృతి ప్రధానంగా మహరాజులు, తర్వాత సుల్తా నులు, బాద్షాల ప్రాపకంలోనే ముందుకు సాగాయి. రాజాస్థానంలో ఉంటేనే సంగీతకారులు లేదా చిత్ర కారులు తమ ప్రతిభాపాటవాలను సొమ్ము చేసుకో వడం తేలిక. రాజుల పోయి ‘భారత ప్రభుత్వం’ వచ్చినా ఆస్థాన సంస్కృతి అలాగే నిలబడిపోయింది. ప్రభుత్వం ఈ కళాకారులకు నిధులు, స్కాలర్‌షి ప్‌లు, విదేశీ పర్యటనలకు అవకాశాలు, ఢిల్లీలో భారీ బంగళాలు, ఇంకా పద్మ అవార్డులు ఇస్తోంది. అయితే, రచయితలు ముఖ్యంగా కవులు, చిత్రకా రులు ఈ సర్కారీ ‘దయ’ నుంచి బయటపడ్డారు. ఈ ర^è యితల్లో ఎక్కువ మంది వామపక్ష సిద్ధాంతాలను నమ్మడం వల్లే భిన్న మార్గం ఎంచుకోగలిగారు.  సినీరంగంలో అంతు లేని డబ్బు, పేరు ప్రఖ్యాతులు సంపాదించి, అత్యంత శక్తిమంతులైన ప్రముఖులు ఊహకందని రీతిలో పిరికిపందలుగా మారిపో యారు.

వామపక్ష తరంతో పాటే మొదట కనిపించిన తెగువ, తిరుగుబాటు  మాయమయ్యాయి. హిందీ పాటల రచయిత, కవి గుల్జార్‌(83) ఒక్కరే ధైర్యంగా నిలబడ్డారు. మిగిలినవారు ముఖ్యంగా, మొదటి తరం కళాకారుల వారసులు అధికారంలో ఉన్నవారికి సలాం చేస్తూ ఆస్థాన రచయితలు, కవులుగా మారి సంతోషంగా జీవిస్తున్నారు. చాలా కొద్దిమంది మాత్రమే నిజమైన, తీవ్ర పోటీ ఉన్న రాజకీయాల్లోకి దిగే సాహసం చేశారు. ఈ సినీ ప్రముఖులందరిలో అతి పెద్ద కళాకారుడైన అమితాబ్‌ బచ్చన్‌ ఎన్నికల రాజకీయాల్లోకి దిగిన మూడేళ్ల లోపే ‘గాయపడి’ వెనుదిరిగారు. ఆయన మళ్లీ రాజకీయాల్లోకి అడుగు పెట్టలేదు. అధికారంలో ఉన్నవారిని తర్వాత ఏనాడూ ఆయన ప్రశ్నించలేదు. ఇటీవల కఠువా, ఉన్నావ్‌ రేప్‌ ఉదంతాలు వెలుగు చూసినప్పుడు ఆయన ‘గంభీర మౌనం’ పాటించారు. బాల్‌ ఠాక్రేపై తీసిన ‘సర్కార్‌’లో నటించినా అమితాబ్‌ నిజజీవి తంలో ఎవరి జోలికీ పోలేదు. అయితే, రాజ్‌ బబ్బర్, శత్రుఘ్న సిన్హా, హేమ మాలిని, స్మృతి ఇరానీ, దివ్య స్పందన వంటి కొందరు మాత్రం భిన్న మార్గంలో పయనిస్తున్నారు. మిగిలిన కళాకారులు కొందరు రాజ్యసభ నామినేటెడ్‌ సభ్యులుగా సంతృప్తిగా బతు కుతూ అవసరం లేకున్నా ప్రభుత్వాలకు అనుకూ లంగా సభలో ఓటు వేస్తున్నారు. 

నీతులు చెప్పడంతోనే పేచీ!
ఈ సినీ ప్రముఖులు తాము రూపొందించే చిత్రాల్లో చెప్పే నీతులు కారణంగా వారిని తప్పు పట్టాల్సి వస్తోంది. మున్నాభాయ్‌ సిరీస్‌ సహా 3 ఈడియట్స్‌ నుంచి పీకే వరకూ రాజ్‌కుమార్‌ హిరాణీ సామాజిక సందేశంతో విజయవంతమైన సూపర్‌ హిట్‌ సిని మాలు తీశారు. విధువినోద్‌ చోప్రా దేశభక్తి బోధిస్తూ తీసిన ద మిషన్‌ కశ్మీర్‌ చూసి జనం కోట్లాది రూపా యలు సమర్పించుకున్నారు. చోప్రా సొంత రాష్ట్ర మైన కశ్మీర్‌లో ఐఎస్‌ఐ కుట్రలను సినిమాలోని మంచి వ్యక్తులు భగ్నం చేయడం మనకు బాగా నచ్చింది. అయితే వారు నివసించే ముంబై నగరంలో మాత్రం ఐఎస్‌ఐని తేలికగా వదిలేశారు. సంజయ్‌దత్‌ అమా యకుని పాత్రలో సామాన్య ప్రజానీకం మధ్య నటిస్తే బాగుంటుంది. కాని, లోపాలతోపాటు ప్రతిభ ఉన్న హీరో పాత్రలో ఆయన అంతగా ఆకట్టుకోలేడు. సంజయ్‌కు ఏకే 56 రైఫిల్‌ సరఫరా చేసిన దావూద్‌ ఇబ్రహీం, ఆయన సోదరుడు అనీస్, ఈ మాఫియా సభ్యులు ఇంకా కరాచీ నుంచి తమ నేర సామ్రాజ్యం నడుపుతూనే ఉన్నారు. అందుకే దావూద్‌ ‘భాయ్‌’ ముఠాతో ఎందుకు పేచీ పెట్టుకోవాలనేది ముంబై సినీప్రముఖుల అభిప్రాయంగా కనిపిస్తోంది. ఇక జనం కోసం ‘భాయ్‌’ సల్మాన్‌ మరో సంచలన చిత్రం నిర్మిస్తారు! కరాచీలో ఉంటున్న ఓ బడా భాయ్‌ని కోర్టు విచారణకు రప్పించడానికి ఈ పనిచేస్తారు. 

అగ్రతారలు చెప్పే సాకు ఏమంటే...
ఇలాంటి విషయాలపై ధైర్యంగా మాట్లాడకపోవడా నికి అగ్రతారలకు చెప్పడానికి సాకులున్నాయి. ఏం మాట్లాడినా తాము భారీగా నష్టపోతామని వారు వాదిస్తారు. ఓసారి బహిరంగంగా ధైర్యంగా మాట్లాడి ఆమిర్‌ ఖాన్‌ ‘పొరపాటు’ చేశారు. ఆయన వ్యాఖ్యలకు ఎదురైన స్పందన ఆయన నోరు మూయించింది. చివరికి ప్రభుత్వంతో ఓ విషయం ప్రచారానికి ఆమిర్‌తో కుదిరిన ఒప్పందం రద్ద యింది. ఇలాంటి సందర్భమే వచ్చినప్పుడు మరో అగ్ర నటుడు షారుఖ్‌ ఖాన్‌ ఈ మాత్రం ధైర్యం కూడా ప్రదర్శించలేదు. కానీ, ముస్లిం పేర్లున్న పాత్రల్లో నటిస్తూ షారుఖ్‌ కనీసం ‘మౌన ప్రకటన’ అయినా చేయగలిగారు. సల్మాన్‌ పూర్తిగా అందరినీ ఓడించే మంచి హిందువుగా నటించారు. తన తాజా చిత్రంలో ఐఎస్‌ఐని దెబ్బదీసే పాత్రలో రాణించారు. అయితే, కేసుల్లో దోషిగా తేలడం వల్ల సల్మాన్‌కు కూడా సంజయ్‌దత్‌ మాదిరిగానే సమస్య ఎదురవు తోంది. సినిమా వంటి మాధ్యమాలు సమకాలీన సామాజిక, ఆర్థిక వాస్తవాలను ప్రతిబింబించడం ఆనవాయితీగా వస్తోంది.

ఆరంభంలో ఈ పనిచేసిన సినిమా రంగం ఇప్పుడు ఆ బాధ్యత విస్మరించింది. సంజూ చిత్రంలో జర్నలిస్టులను దుర్మార్గులుగా చిత్రించడం, వారిపై విద్వేషం కక్కడంపై నాకు కోపం ఏమీ లేదు. పత్రికల్లో ఈ సినీ ప్రముఖులు తమకు అనుకూలంగా ఎలా రాయించుకుంటు న్నారో నాకు బాగా తెలుసు. అలాగే సినిమాలు బాగు న్నాయని డబ్బు ఇచ్చి మరీ ‘రేటింగ్స్‌’ సంపాదించు కుంటున్నారనేది బహిరంగ విషయమే. అయితే, జర్నలిస్టులను ఇంతగా మాయ చేసి లోబరుచుకున్నా గాని–1993 ముంబై బాంబు పేలుళ్ల చరిత్రను ఎవరూ మార్చలేరు.  శక్తిమంతమైన సినీ ప్రపంచం సమాజంలో మార్పు తీసుకురాగలదు. బడుగు బల హీన వర్గాలు, మైనారిటీల హక్కుల రక్షణకు తోడ్పడ గలుగుతుంది. అయితే, అధికారంలో ఉన్న వ్యక్తులు, ప్రభుత్వాలు, సొంత మూక బలమున్న రాజ్‌ఠాక్రే, దావూద్‌ ఇబ్రాహీం వంటి ‘బలవంతుల’ ముందు తలలు వంచితే ఈ పనులు చేయడం కుదరదు. కొన్ని వర్గాల ప్రజలపై ఉన్న అనుమానాలను తప్పని చెప్ప డంగాని, రాజ్యాధికారంతో విర్రవీగేవారిని ప్రశ్నించ డంగాని సాధ్యం కాదు. ప్రభుత్వం కోరుకుంటుంది కాబట్టి మరుగుదొడ్లపై సినిమా తీయడం తేలికే. దేశంలో సినిమాల నిర్మాణం మొదలై ఇంత కాల మైనా పది మంది అగ్రశ్రేణి హీరోల్లో ఒక్కరూ కూడా ఓ దళితుడి పాత్ర వేయలేదు. రజనీకాంత్‌ మాత్రమే సగర్వంగా, ఆత్మవిశ్వాసంతో ఆ పని చేయగలిగారు.

ముంబై ‘భాయ్‌ల’ ముందు మోకరిల్లారు!
అత్యంత శక్తిమంతమైన భారత సినీ ప్రపంచం నేర ప్రపంచంలో రారాజులైన ‘భాయ్‌’ల ముందు మోకరి ల్లిందనే విషయం మనం మరువ రాదు. తమ నిర సన తెలపడానికి ఈ సినీ ప్రముఖులు ఏనాడూ ప్రధా నమంత్రి ఇంటికి ఊరేగింపుగా పోలేదు. వారు గుట్టు చప్పుడు కాకుండా రాజీపడతారు. ముంబై పోలీ సుల్లో ఓ చిన్న బృందం గ్యాంగ్‌స్టర్లను ఎన్‌కౌంటర్లలో కాల్చిచంపే పని ప్రారంభించగానే వారు సాగిలపడి మరీ తమ జోలికి రావద్దని వేడుకున్నారు. అయితే, అంతా చీకటే కాదు, కొత్త ఆశలు చిగురించే పరి స్థితులు కనిపిస్తున్నాయి. అనేక మంది కొత్త, యువ సినీ దర్శకులు, కళాకారులు తమ అభిప్రా యాలు, ఆదర్శాలు, లక్ష్యాలను బాహాటంగా తమ చిత్రాల్లో ప్రదర్శించడానికి వెనుకాడడం లేదు. అధికారంతో విర్రవీగేవారిని ప్రశ్నించడానికి వారు తెగువ ప్రద ర్శిస్తున్నారు. ఇలాంటి వారి సంఖ్య పెరగడమే గాక, వారు వృత్తిలో విజయం సాధించడం మనకు ఆనందాన్నిచ్చే విషయం. వారేమీ అగ్రశ్రేణి దర్శ కులు, నిర్మాతలు, తారలు కాలేదు. ఎప్పటికీ కాకపో వచ్చు కూడా. కానీ, వారు శక్తిమంతులు. వారే హిందీ సినిమా రంగాన్ని భవిష్యత్తులో సృజనాత్మక మార్గంలో నడిపిస్తారు.


శేఖర్‌ గుప్తా, వ్యాసకర్త దప్రింట్‌ చైర్మన్, ఎడిటర్‌–ఇన్‌–చీఫ్‌

Advertisement

తప్పక చదవండి

Advertisement